ప్రేమ వద్దన్నందుకు.. బాలిక ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-06-17T05:36:58+05:30
ఇంటర్ చదువుతున్న ఓ బాలిక (17) ప్రేమలో పడింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఆత్యహత్య చేసుకుంది. దీంతో పోలీస్ కేసు అవుతుందేమోనని భయపడ్డ కుటుంబ సభ్యులు కూతురి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేశారు.
రాత్రికి రాత్రే మృతదేహాన్ని దహనం చేసిన కుటుంబసభ్యులు
ఆరుగురి అరెస్టు
మైదుకూరు(కడప): ఇంటర్ చదువుతున్న ఓ బాలిక (17) ప్రేమలో పడింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఆత్యహత్య చేసుకుంది. దీంతో పోలీస్ కేసు అవుతుందేమోనని భయపడ్డ కుటుంబ సభ్యులు కూతురి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు కుటుంబసభ్యులను అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి మైదుకూరులో డీయస్పీ విజయ్కుమార్ వివరాలను వెల్లడించారు.
బద్వేలు మండలం అనంతరాజపురం పంచాయతీలోని సి.బోయనపల్లెకు చెందిన పిల్లిబోయిన రమణయ్య కూతురు(17) ఓ అబ్బాయిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని కూతురు తేల్చిచెప్పడంతో.. చిన్నవయస్సులో పెళ్లి వద్దని చదువుకుంటే తర్వాత చూద్దామని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో మనస్తాపానికి బాలిక ఇంట్లో ఉరి వేసుకుంది. పోలీసు కేసు అవుతుందని భయపడ్డ తండ్రి రమణయ్య తన దగ్గరి బంధువులకు తెలియచేసి మంగళవారం రాత్రి మృతదేహాన్ని సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేశారు. గ్రామ వీఆర్వో మన్నెపల్లె నరసింహులు ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రి రమణయ్య, కుటుంబ సభ్యులు పెంచలయ్య, చిన్న పెంచలయ్య, నరసింహులు, చిన్న నరసింహులు, మరో పెంచలయ్యను అరెస్టు చేశారు. డీఎస్పీ విజయకుమార్ మాట్లాడుతూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాస్తవాలు చెప్పాలని, భయపడి ఇలా చేస్తే నేరస్తులు అవుతారని అన్నారు. అత్మహత్య చేసుకుంటే పోస్టుమార్టంలో తేలుతుందన్నారు.
Updated Date - 2021-06-17T05:36:58+05:30 IST