‘జువారీ’కి హైకోర్టులో ఊరట
ABN, First Publish Date - 2021-05-06T08:53:54+05:30
పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, తుమ్మలపల్లె గ్రామంలోని జువారీ పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు
పరిశ్రమ మూతకు కాలుష్య మండలి జారీచేసిన ఉత్తర్వులు నిలిపివేత
అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, తుమ్మలపల్లె గ్రామంలోని జువారీ పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జూన్ చివరి వారానికి వాయిదా వేసింది. పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది ఏప్రిల్ 23న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎర్రగుంట్ల జువారీ సిమెంట్ ప్లాంట్ అధిపతి గంటా నాగభూషణ్రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరావు వాదనలు వినిపిస్తూ... చట్టనిబంధనలు అనుసరించకుండా నోటీసులు జారీ చేశారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పీసీబీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. కంపెనీకి ముందుగా నోటీసు ఇచ్చి.. కాలుష్య నిబంధనలు సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
Updated Date - 2021-05-06T08:53:54+05:30 IST