కరోనా నుంచి కోలుకున్నందుకు జంతు బలి చేస్తారా?
ABN, First Publish Date - 2021-08-12T22:01:09+05:30
కరోనా నుంచి కోలుకున్నందుకు ద్వారకా తిరుమల ఆలయ పరిసరాల్లో జంతు బలి చేస్తారా అని
అమరావతి: కరోనా నుంచి కోలుకున్నందుకు ద్వారకా తిరుమల ఆలయ పరిసరాల్లో జంతు బలి చేస్తారా అని ఈవోను జనసేన నాయకుడు పోతిన వెంకటమహేష్ నిలదీశారు. ద్వారకా తిరుమల వెంకన్నను ఈవో సుబ్బారెడ్డి అవమానించారని ఆయన ధ్వజమెత్తారు. కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఆలయ పరిసరాల్లో జంతుబలి కార్యక్రమం చేపట్టారన్నారు. కరోనా నుంచి కోలుకున్నందుకు జంతు బలి చేస్తారా అన ఆయన ప్రశ్నించారు. వెంకన్న ఆలయంలో ఇలాంటి ఆచారాలు ఎక్కడైనా చూశామా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నీతులు చెప్పే అవినీతి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీనిపై మాట్లాడరా అని మహేష్ ప్రశ్నించారు. విచారణాధికారి ఏఈవో రామాచారి జంతుబలిని నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు. ఈవో సుబ్బారెడ్డి కక్ష కట్టి మరీ రామాచారిని వేధించారన్నారు. ఈ వేధింపులతోనే మనస్తాపంతో రామాచారి గుండె నొప్పితో ఆకస్మికంగా మరణించారన్నారు. ఈవో సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై మంత్రి వెల్లంపల్లి వాస్తవాలు ప్రజలకు వివరించాలని పోతిన మహేష్ అన్నారు.
కొన్ని రోజుల క్రితం వెంకన్న ఆలయం పరిసరాల్లో జరిగిన అపచారం తెలిసిందే. దేవస్థానం ఇంజనీరింగ్ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి మేకపోతు చెవులు కోసి మొక్కులు చెల్లించారు.
Updated Date - 2021-08-12T22:01:09+05:30 IST