గ్రూప్1 పరీక్ష రద్దుకు నో
ABN, First Publish Date - 2021-03-05T09:10:53+05:30
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దుచేసి, తాజాగా నిర్వహించాలన్న అప్పీళ్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేసింది. పరీక్ష తాజాగా
రద్దు కోరుతూ దాఖలైన అప్పీళ్లను
కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దుచేసి, తాజాగా నిర్వహించాలన్న అప్పీళ్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేసింది. పరీక్ష తాజాగా నిర్వహించేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్పకుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించింది. 2018 డిసెంబరులో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. దానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేయడంలో 51 తప్పులు దొర్లాయని, పరీక్ష సమయంలో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ను అనుమతించలేదని, ఈ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి, తాజాగా నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ పరీక్ష రద్దుకు నిరాకరిస్తూ గతేడాది అక్టోబరు 22న తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ షేక్ షాన్వాజ్, మరికొందరు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు.
ప్రశ్నల్లో భారీగా తప్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పులకు అభ్యర్థులందరికీ సమానంగా మార్కులు ఇచ్చామన్నారు. ఇదే అంశంతో ముడిపడి ఉన్న అప్పీళ్లలో ధర్మాసనం జోక్యం చేసుకోవడానికి నిరాకరించిందని గుర్తుచేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. గురువారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Updated Date - 2021-03-05T09:10:53+05:30 IST