భారీ వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం
ABN, First Publish Date - 2021-11-21T20:27:39+05:30
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి.
అమరావతి: ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. ఇంకా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. వంతెనలు కూలిపోతున్నాయి. ప్రాణ, ఆస్తుల నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంథకారం అలుముకుంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు వరద నీటితో కలిసిపోయాయి. పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 27మంది మరణించారు. వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.
కడప జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కమలాపురం పాపాగ్నినది ఉధృతికి కుంగిన బ్రిడ్జి కూలింది. కడప నగరంతో పాటు పలు చోట్ల పాతభవనాలు కూలుతున్నాయి. జిల్లాలో వరదలకు ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 24 మంది గల్లంతు కాగా 12 మృతదేహాలు గుర్తించారు. సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత గ్రామాల ప్రజలు చెపుతున్నారు. భారీగా ఆస్తులు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో జిల్లా ప్రజలు ఊపరి పీల్చుకుంటున్నారు.
స్వర్ణముఖి వరద ప్రవాహానికి కేసీపేట, తనపల్లి, తిరుచానూరు గ్రామాల సమీపంలో ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. తిరుచానూరు వైపు నుంచి పాడిపేట, ముండ్లపూడి, తనపల్లి, కుంట్రపాకం, వెంకటరామపురం తదితర 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి తగ్గితే గానీ... తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, కనీసం 20 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో 30 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వదర ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం అందడంలేదు. అధికారులు, వాలంటీర్లు పట్టించుకోవడంలేదు.
Updated Date - 2021-11-21T20:27:39+05:30 IST