ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలి
ABN, First Publish Date - 2021-11-30T05:14:26+05:30
ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పిల్లలకు ఉద్యోగాలు, ఉచిత ఇంటి నిర్మాణంతోపాటు, ఉచిత శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హమీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు రూ.10వేలు కడితేనే ఓటీఎస్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారని పులిచింతల ముంపు గ్రామమైన అచ్చంపేట మండలం, ఆర్.ఆర్ సెంటర్కు చెందినకాలనీవాసుల వాపోయారు.
పులిచింతల ముంపుగ్రామ బాధితుల వినతి
గుంటూరు (తూర్పు), నవంబరు 29: ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పిల్లలకు ఉద్యోగాలు, ఉచిత ఇంటి నిర్మాణంతోపాటు, ఉచిత శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హమీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు రూ.10వేలు కడితేనే ఓటీఎస్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారని పులిచింతల ముంపు గ్రామమైన అచ్చంపేట మండలం, ఆర్.ఆర్ సెంటర్కు చెందినకాలనీవాసుల వాపోయారు. పునరావాస కాలనీలకు ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యంతోపాటు, ప్రత్యేక గ్రామపంచాయతీగా ప్రకటించాలని కోరుతూ సోమవారం స్పందనలో కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పూటగడవక ఇబ్బంది పడుతుంటే రూ.10వేలు కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని దీంతో కాలనీలోని 300కుటుంబాలు దిక్కుతోచనిస్థితిలో పడ్డాయన్నారు. ముంపు బాధితులకు సంబంధించి ఎండోమెంట్ పరిహారం ఇంతవరకు అందించకుండా ఇప్పుడు ఓటీఎస్ తీసుకువచ్చి డబ్బులు అడగడం దారుణమన్నారు. న్యాయం జరుగుతుందని ఇంతదూరం వచ్చామని... ఇక్కడి అధికారులు కూడా రూ.10వేలు కట్టాకే ఇతర డిమాండ్లపై ఆలోచిస్తామని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే పునరావాసకాలనీలకు ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి, పునరావాసకాలనీలను గ్రామపంచాయతీలుగా ప్రకటించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాణావత్ బిక్కూనాయక్, నరసింహనాయక్, వెంకటేశ్వర్లు నాయక్, శ్రీను. గోపినాయక్, ముత్తయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-11-30T05:14:26+05:30 IST