రేషన్ బియ్యం కోసం ధర్నా
ABN, First Publish Date - 2021-05-17T05:57:03+05:30
రేషన్ బియ్యాన్ని ఇవ్వాలంటూ జానపాడు ఎస్సీకాలనీ వాసులు ఆదివారం ధర్నా చేశారు. ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ మాట ఎలా ఉన్నా... వీధికొక రోజు చుట్టపుచూపులా వస్తున్న మినీ వాహనం అరకొరగా పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్కదారి పట్టిస్తున్నారంటున్న గ్రామస్థులు
పిడుగురాళ్ల(జానపాడు), మే 16: రేషన్ బియ్యాన్ని ఇవ్వాలంటూ జానపాడు ఎస్సీకాలనీ వాసులు ఆదివారం ధర్నా చేశారు. ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ మాట ఎలా ఉన్నా... వీధికొక రోజు చుట్టపుచూపులా వస్తున్న మినీ వాహనం అరకొరగా పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా వీధుల్లోకి వచ్చే మినీవాహనం వద్దకు వెళ్తే షాపు వద్దకు వెళ్లాలని.. షాపు వద్దకు వెళ్తే మీ వీధుల్లోకి వచ్చే వాహనం వద్దకే వెళ్లాలని చెప్తూ రేషన్ తమకు ఇవ్వడంలేదన్నారు. ఆ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. ఒక్కోసారి వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇవ్వకపోవటమేకాక తీసుకుంటే డబ్బులు తీసుకోండి.. లేదంటే పొండి అంటున్నారని తెలిపారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకనే చివరకు ధర్నా చేయాల్సి వచ్చిందని కాలనీవాసులు తెలిపారు. కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం స్టాక్లేదని చెప్తూ అక్రమంగా తరలిస్తున్నారని కాలనీవాసులు ఎస్ఐ చరణ్కు తెలిపారు. జానపాడు సర్పంచ్ మర్యాదరావు కూడా కాలనీవాసులకు మద్దతుగా నిలిచారు. పిడుగురాళ్ల, కారంపూడి రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ధర్నా చేస్తున్న వారితో చర్చించిన ఎస్ఐ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Updated Date - 2021-05-17T05:57:03+05:30 IST