నేర నియంత్రణపై అవగాహన పెంచుకోవాలి
ABN, First Publish Date - 2021-10-27T04:27:59+05:30
అసాంఘిక శక్తుల అణచివేత, శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణ, నేర దర్యాప్తులో పోలీసులు ఉపయోగించే మెళకువలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ అన్నారు.
విద్యార్థులకు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ సూచన
ఓపెన హౌస్లో ఆయుధాల ప్రదర్శన
గుంటూరు, అక్టోబరు 26: అసాంఘిక శక్తుల అణచివేత, శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణ, నేర దర్యాప్తులో పోలీసులు ఉపయోగించే మెళకువలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం పోలీసు పరేడ్గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెనహౌస్ నిర్వహించారు. పోలీసులకు సంబంధించిన ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, డాగ్ స్వాడ్, క్లూస్ టీం పనితీరు వంటి వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఐజీ త్రివిక్రమవర్మ, రూరల్ ఎస్పీ విశాల్గున్నీలు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు వాటి పనితీరు, వాటి ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా డీఐజీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ పోలీసులు నేరస్థులను పట్టుకోవటం, వేలి ముద్రలు సేకరించటం, ఆయుధాలు ఉపయోగించటం వంటివి నేర పరిశోధనలో ముఖ్యమైనవన్నారు. రూరల్ ఎస్పీ విశాల్గున్నీ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసు శాఖ అనేక అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు వెళుతుందన్నారు. దీనిపై విద్యార్థి దశలోనే అవగాహన పెంచుకుంటే ఇవి వారి మనసులో బలంగా నాటుకుపోతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అర్బన అదనపు ఎస్పీ గంగాధరం, రూరల్ అదనపు ఎస్పీలు ఎనవీఎస్ మూర్తి, ఎస్వీడీ ప్రసాద్, డీఎస్పీలు విజయభాస్కరరెడ్డి, కమలాకర్, స్రవంతిరాయ్, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-10-27T04:27:59+05:30 IST