కాల్వ పక్కన కాలిన మృతదేహం లభ్యం
ABN, First Publish Date - 2021-05-09T05:35:27+05:30
మండలంలోని గణపవరం సమీపంలో గల ఎనెస్పీ కెనాల్ సమీపంలో కాలిన మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు.
నాదెండ్ల, మే 8: మండలంలోని గణపవరం సమీపంలో గల ఎనెస్పీ కెనాల్ సమీపంలో కాలిన మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ సతీష్లు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గణపవరం- నాదెండ్ల మార్గంలోని ఎన్ఎస్పీ కాల్వ ఎత్తు కట్టకు తూర్పు వైపున సుమారు అర కిలోమీటరు దూరంలో ఈ మృతదేహం పడి ఉంది. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం సమీపంలో దంతాల సెట్, రెండు లీటర్ల పెట్రోలు డబ్బా, తెలంగాణ మద్యం బాటిళ్లను గుర్తించారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి తగలబెట్టి ఉండవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. వివరాలు తెలిసినవారు నాదెండ్ల ఎస్ఐ, చిలకలూరిపేట రూరల్ సీఐ ఫోన్ నంబర్లు 94409 00881, 94407 96268కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Updated Date - 2021-05-09T05:35:27+05:30 IST