తొలగింపుపై.. నిరసన!
ABN, First Publish Date - 2021-01-06T04:16:29+05:30
రాజధాని అమరావతిలో ఇప్పటివరకు అంతర్భాగంగా ఉన్న 6 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం అందులో నుంచి తప్పించి, మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేసింది. దీనిపై రాజధాని ప్రాంతంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అమరావతి నుంచి 6 గ్రామాల తొలగింపు
మాస్టర్ప్లాన్లో అంతర్భాగమైన వాటినెలా తప్పిస్తారంటున్న రైతులు
స్టే అమల్లో ఉండగానే తాజా ఆదేశాలు!
న్యాయస్థానంలో సవాల్కు సమాయత్తం
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఇప్పటివరకు అంతర్భాగంగా ఉన్న 6 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం అందులో నుంచి తప్పించి, మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేసింది. దీనిపై రాజధాని ప్రాంతంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమరావతి మాస్టర్ప్లాన్లో మొత్తం 29 గ్రామాలున్నాయి. వాటిలోని ఉండవల్లి, పెనుమాకను తాడేపల్లి మున్సిపాలిటీలో, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రును మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఆదేశాలిచ్చింది! దీంతో అమరావతిలో భాగంగా నోటిఫై చేసిన 29 గ్రామాల్లో ప్రస్తుతం 23 మాత్రమే మిగిలినట్లయింది! దీని ద్వారా వైసీపీ సర్కారు అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు ఏడాది క్రితమే నిడమర్రును మినహాయించి మిగిలిన వాటిని అమరావతి మాస్టర్ ప్లాన్లో నుంచి తప్పించి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. దానికి వ్యతిరేకంగా రాజధాని రైతుల పరిరక్షణ సమాఖ్య హైకోర్టును ఆశ్రయించగా, ఉన్నత ధర్మాసనం స్టే మంజూరు చేసింది. ఇప్పటికీ ఆ స్టే అమలులోనే ఉంది. అయినప్పటికీ.. జగన్ సర్కార్ స్టే వర్తించే ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడిలతోపాటు కొత్తగా నిడమర్రును మున్సిపాలిటీల్లో చేర్చేసింది. మాస్టర్ ప్లాన్లో చేరి ఉన్న గ్రామాలను దాని నుంచి తొలగించడంపై స్టే అమలులోనే ఉండడం, పైగా ఏపీసీఆర్డీయే రద్దే తగదంటూ వేసిన కేసుల్లో తీర్పు వెలువడనప్పటికీ ఆ 6 గ్రామాలను విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఆ ప్రాంతవాసులు సమాయత్తమవుతున్నారు.
Updated Date - 2021-01-06T04:16:29+05:30 IST