ఆస్కార్ స్థాయి నటనను ప్రదర్శిస్తున్న జగన్!
ABN, First Publish Date - 2021-01-16T05:24:50+05:30
దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై చర్యలు తీసుకోకుండా గోపూజ చేసి సీఎం జగన్ కపట నాటకం ఆడుతూ ఆస్కార్ స్థాయి నటనను వలకపోస్తున్నారంటూ టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు.
జీవీ ఆంజనేయులు
గుంటూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై చర్యలు తీసుకోకుండా గోపూజ చేసి సీఎం జగన్ కపట నాటకం ఆడుతూ ఆస్కార్ స్థాయి నటనను వలకపోస్తున్నారంటూ టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం ఆయన ఆన్లైన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గోమాతను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయటం తగదని హితవు పలికారు. సరైన పోషణ లేక గోశాలల్లో గోవులు మృత్యువాత పడినప్పుడు సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇడుపులపాయలో క్రూరమృగాలను పెంచుతూ గుడికో గోమాత కార్యక్రమం చేపట్టటం విడ్డూరంగా ఉందన్నారు. బాబాయి హత్యపై జాలిచూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమేనన్నారు. ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం సీఎంకు లేదని తెలిపారు. మాన్సాస్ ట్రస్టు నుంచి అశోకగజపతిరాజుని చైర్మన్గా తొలగించినా జగన్ కక్ష తీరలేదని.. అందుకే రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వసం చేసి ఆయనను భాద్యున్ని చేస్తూ చైర్మన్ పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. మతాల మధ్య మంటపెట్టి చలికాచుకునే విధానానికి వైసీపీ స్వస్తి పలకాలని జీవీ అన్నారు.
Updated Date - 2021-01-16T05:24:50+05:30 IST