భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి మహోత్సవాలు
ABN, First Publish Date - 2021-07-24T05:44:25+05:30
గురుపౌర్ణమిని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాలలో శుక్రవారం గురుపూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
గుంటూరు(సాంస్కృతికం), జూలై 23: గురుపౌర్ణమిని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాలలో శుక్రవారం గురుపూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. విద్యానగర్లోని సాయినాథ సన్నిధానంలో వేద పండితులు తేజ శర్మ, క్రాంతి శర్మల ఆధ్వర్యంలో బాబాకు పంచామృతాభిషేకం, విశేష పూజలు, అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు యడ్లపాటి అశోక్ కుమార్, అధ్యక్షుడు వడ్లమూడి శివరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వికాస్నగర్ షిరిడీ సాయి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎన్.పూర్ణచంద్రరావు దంపతుల ఆధ్వర్యంలో బాబాకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు, అలంకరణ జరిగాయి. కార్యక్రమంలో కార్యదర్శి సుందరరామయ్య, ఉపాధ్యక్షురాలు కె.లలితా లక్ష్మి పర్యవేక్షించారు. స్థానిక అమరావతి రోడ్డు సుందర సదనంలో వేదవ్యాస మహర్షికి ప్రత్యేక పూజలు, అలంకరణ, ఆంజనేయస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగాయి. కార్యక్రమాన్ని సంస్థ నిర్వాహకుడు కల్వకొలను రామకృష్ణశర్మ పర్యవేక్షించారు.
గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం
పొన్నూరు రోడ్డులో సంగడిగుంట వద్దనున్న షిరిడీ సాయినాథుని ఆలయంలో శుక్రవారం గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రావూరి లక్ష్మీనారాయణశాస్త్రి తెలిపారు.
Updated Date - 2021-07-24T05:44:25+05:30 IST