దీవెన కాదు విద్యార్థుల రోదన
ABN, First Publish Date - 2021-07-30T06:10:07+05:30
పేద విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పథకాలను రద్దు చేసి కంటితుడుపుగా సీఎం జగన్రెడ్డి అందిస్తున్న విద్యా దీవెనతో రాష్ట్రంలోని విద్యార్థులు రోదిస్తున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు.
గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పథకాలను రద్దు చేసి కంటితుడుపుగా సీఎం జగన్రెడ్డి అందిస్తున్న విద్యా దీవెనతో రాష్ట్రంలోని విద్యార్థులు రోదిస్తున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. గురువారం ఆన్లైన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విదేశీ విద్య పథకం, ఉన్నత విద్యానిధి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బాలికలకు సైకిళ్ల పంపిణీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం, మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు తదితరాలన్నింటిని రద్దు చేశారన్నారు. దీంతో లక్షలాది మంది పేద విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యలో నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం చంద్రబాబు హయాంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా జగన్ అసమర్థపాలనతో అది 19వ స్థానానికి దిగజారిందన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2021 విద్యా సంవత్సరం నుంచి విద్యాదీవెన నిలిపివేశారన్నారు. ప్రతి బడ్జెట్లో విద్యకు 15 శాతం పెరుగుదల ఉంటుంది కానీ జగన్ రెడ్డి పాలనలో అది లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. జాబు లేని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు.
Updated Date - 2021-07-30T06:10:07+05:30 IST