పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగొద్దు
ABN, First Publish Date - 2021-02-07T05:41:36+05:30
ఓటువేస్తుండగా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం నిషేధమని అలా చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల పరిశీలకుడు కాంతిలాల్ దండే
రెంటచింతల, కారంపూడి, వెల్దుర్తి, ఫిబ్రవరి 6: ఓటువేస్తుండగా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం నిషేధమని అలా చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం రెంటచింతలలోని సచివాలయం-2లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని స్వీయచిత్రాలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పెట్టే యువత ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సురేష్నాయక్, ఎన్నికల అధికారి గంటా శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కాంతిలాల్ దండే సందర్శించి ఒప్పిచర్ల, నరమాలపాడు గ్రామాల నామినేషన్లను స్వీకరిస్తున్న స్టేజ్-1 అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలన్నారు. అభ్యర్థులకు కావాల్సిన క్లియరెన్స్, కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే అందించాలని సూచించారు. వెల్దుర్తి మండలంలోని మండాది నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కాంతిలాల్ దండే పరిశీలించారు. నామినేషన్లు జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్ఐ సుధీర్ ఉన్నారు.
Updated Date - 2021-02-07T05:41:36+05:30 IST