మరింత అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2021-05-08T05:38:02+05:30
కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులు, వైద్యులు ఇతర ఉద్యోగులు మానవతా దృక్పధంతో పనిచేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కొవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి ఉషారాణి కోరారు.
కొవిడ్ ప్రత్యేక అధికారి ఉషారాణి
గుంటూరు(తూర్పు), మే7: కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులు, వైద్యులు ఇతర ఉద్యోగులు మానవతా దృక్పధంతో పనిచేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కొవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి ఉషారాణి కోరారు. కలెక్టరేట్లో కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై శుక్రవారం కలెక్టర్ వివేక్యాదవ్తో కలసి కొవిడ్ నోడల్ అధికారులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణకు జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా జనాలు ఉండకుండా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలు సాధ్యమైనంత వరకు ఆస్పత్రుల్లో కాకుండా దగ్గర్లోని కల్యాణమండపాలు, ఇతర భవనాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. హోంఐసోలేషన్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఆహారం సరఫరా చేసేందుకు సచివాలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో కలసి సివిల్ సప్లయ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ఇంటి వద్దనే నిర్వహించేలా మతపెద్దలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు.
Updated Date - 2021-05-08T05:38:02+05:30 IST