మీలో పౌరుషం ఏమైంది..?
ABN, First Publish Date - 2021-03-09T06:16:13+05:30
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ..
అమరావతిని మూడు ముక్కలు చేస్తుంటే స్పందించరా..?
ప్రజలను ప్రశ్నించిన నారా చంద్రబాబునాయుడు
తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
టీడీపీ అధినేత పర్యటన విజయవంతంతో అభ్యర్థుల్లో ఉషారు
మైనారిటీల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు నగరంలో చేపట్టిన రోడ్ షో విజయవంతం అయింది. తూర్పు, పశ్చిమ నియోకవర్గాల్లో సాగిన ఈ రోడ్ షో క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. దారి పొడవునా చంద్రబాబు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూనే ప్రజలను ప్రశ్నలను సంధించారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తుంటూ మీరు స్పందిచరా అంటూ నిలదీశారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నిర్మించిన అమరావతిని జగన్ నిర్వీర్యం చేస్తుంటే మీలో పౌరుషం కలగటం లేదా అంటూ చురకలంటించారు.
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రోడు షో విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుల ఆగడాలు, దౌర్జన్యాలు, భూదందాలపై ఆయన ప్రశ్నించారు. వీటితో పాటు ఈ ప్రాంత ద్రోహిగా సీఎం జగన్ను, జిల్లా దోషులుగా వైసీపీ నేతలను అభివర్ణించారు. నాని ఓడిపోతే ఇక వైసీపీ బరితెగింపే అంటూ ప్రజలను హెచ్చరించారు. అలానే వైసీపీకి ఓటు వేస్తే పన్నుల బాదుడే అంటూ చంద్రబాబు ప్రజలను ఆలోచింపచేశారు. అలానే తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాను మాయల ఫకీరు, గుట్కా ఎమ్మెల్యే అంటూ నేరుగా విమర్శించారు. పార్టీ కష్టాలో ఉన్నప్పుడు మనం గెలిపించిన ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీ వదిలేశారు.. భయపడాల్సిన పనిలేదని ఒకరుపోతే వందమంది నాయకులను తయారు చేస్తానని క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు.
ప్రజలకు ప్రశ్నలు..
దారి పొడవున చంద్రబాబు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూనే ప్రజలను ప్రశ్నలు సంధించారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తుంటూ మీరు స్పందిచరా అంటూ నిలదీశారు. మీపిల్లల భవిష్యత్తు కోసం నిర్మించిన అమరావతిని జగన్ నిర్వీర్యం చేస్తుంటే మీలో పౌరుషం కలగటం లేదా అంటూ చురకలంటించారు. నిత్యావసరాల ధరలు పెగుతున్నా ఎందుకు అడగడం లేదన్నారు. గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీ జెండా ఇక్కడ కట్టనిస్తారా అన్నారు. పక్కనే కృష్ణానది ఉన్నా ట్రాక్టర్ ఇసుకైనా దొరుకుతుందా అంటూ ప్రశ్నించారు. త్వరలో ఆస్తిపన్నును పెంచబోతున్నారంటూ హెచ్చరించారు. జగన్ అమ్మఒడి ఇచ్చింది రూ.14వేలు అయితే నాన్న బుడిక్డి రూ.34వేలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారంటూ సెటైర్లు వేశారు. గుంటూరు మిర్చి ఘాటు 10న జరిగే ఎన్నికల్లో చూపించాలని కోరారు. అపార్టుమెంట్లలో ఉండేవారు తామేందుకు నిలబడి ఓటు వేయాలని అనుకుంటే తర్వాత తీరిగ్గా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలానే కార్యకర్తలను వదలేద్దు. నాయకత్వాలు వర్ధిలాలని నినాదాలు కాదు... పదిమంది చేత ఓట్లు వేయించేలా చూడాలంటూ క్లాస్ తీసుకున్నారు.
ఒక్క అవకాశం అంటూ అడిగారు.. ఒక్కసారి చాన్స్ అంటే కరెంటు తీగ పట్టుకుంటారా అని నేను నాడు చేప్తే మీరు వినలేదు.. ఇప్పుడు మీలో ఒక్కరైనా సుఖంగా ఉన్నారా..? సామాన్యుడు జీవించే పరిస్థితి లేదు. నిత్యావసరాల ధరలకు విపరీతంగా పెరిగిపోయాయి. ఇసుక, లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది.
మీలో గుంటూరు ఘాటుతనం, పౌరుషం ఏమైంది..? కేసులు పెడతారేమోనన్న భయం పెరిగిందా..? నేను రాజకీయం మాట్లాడటం కోసం రాలేదు.. ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు. 14ఏళ్లు సీఎంగా చేశాను నా రికార్డును ఎవరూ టచ్కూడా చేయలేరు. నా బాధంతా ప్రజలు ఏమవుతారోననే..! మీ ప్రాంతంపైన ప్రేమ, మీ జీవితాలపైన ఆశ, మీ పిల్లల భవిష్యుత్తుపై మమకారం ఉంటే టీడీపీ అభ్యర్థులకు ఓటెయ్యండి.
తూర్పు నియోజకవర్గంలో ఇక్కడి ఎమ్మెల్యే మాయలఫకీర్, గుట్కా ఎమ్మెల్యే. అలానే పశ్చిమలో నేను గెలిపించిన ఎమ్మెల్యే పార్టీ కష్టాలో ఉంటే వదిలి వెళ్లిపోయాడు. అటువంటి వాళ్లను వందమందిని తయారు చేస్తా.. పక్కనే ఉన్న మాచర్లలో నాయకులపై దాడిచేసిన రౌడీషీటర్ మున్సిపల్ చైర్మన్. అలానే గుంటూరులో నాని ఓడిపోతే ఇక్కడా బరి తెగిస్తారు.. ప్రజాస్వామ్యం కావాలా... రౌడీరాజ్యం కావాలో తేల్చుకోండి.
మైనారిటీలో రెట్టించిన ఉత్సాహం
చంద్రబాబు పర్యటన మైనారిటీ నేతలు అభ్యర్థులో ఉత్సాహాన్ని నింపింది. నగరంలోని మూడో వార్డు నుంచి 14వ వార్డు వరకు మైనార్టీ ఓట్లు కీలకం. ఈ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్దసంఖ్యలో మైనార్టీ మహిళలు తరలిరావడం కనపడింది. ఈ ప్రాంతంలో తన ప్రసంగంలో రద్దయిన రంజాన్ తోఫా, షాదీముబారక్, విదేశీ విద్యా రుణ పథకం రద్దు అంశాలను పదే పదే ప్రస్తావించారు. దీనికి వారి నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. ఎన్నార్సీకి జగన్ పార్లమెంట్లో మద్దతు ఇవ్వడానికి కూడా చంద్రబాబు అనేక చోట్ల ప్రస్తావించారు. ఈ సందర్భంగా యువత నుంచి స్పందన కనపడింది.
Updated Date - 2021-03-09T06:16:13+05:30 IST