ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
ABN, First Publish Date - 2021-07-26T08:32:15+05:30
గోవధ నిషేధ చట్టంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
- గోవధ నిషేధ చట్టంపై వ్యాఖ్యలకు నిరసన
- బీజేపీ నాయకులు, కార్యకర్తల అరెస్టు
ఎమ్మిగనూరు, జూలై 25: గోవధ నిషేధ చట్టంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిని ఆదివారం ముట్టడించారు. ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు అడ్డుకున్న చోటనే బీజేపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి, నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, హిందూ ద్రోహి అనీ నినాదాలు చేశారు. ప్రతిగా వైసీపీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలు చేశారు. క్రమేపీ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మొత్తం 30 మందిపై కేసు నమోదు చేసి, సొంత పూచీకత్తుపై వదిలారు. ముట్టడి కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, రాష్ట్ర నాయకులు హరీ్షబాబు, ప్రకాష్ జైన్, మురహరి రెడ్డి, కునిగిరి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.
చెన్నకేశవరెడ్డి క్షమాపణ చెప్పాలి: సుధాకర్ యాదవ్
మతాల మధ్య చిచ్చు పెట్టడాన్ని వైసీపీ నేతలు మానుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
Updated Date - 2021-07-26T08:32:15+05:30 IST