AP: ఈ-కేవైసీ కష్టాలు..
ABN, First Publish Date - 2021-08-18T17:15:49+05:30
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మందికి వచ్చే నెల రేషన్ ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది.
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మందికి వచ్చే నెల రేషన్ ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈకేవైసీ చేసుకోనివారికి రేషన్ పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. ఈకేవైసీ చేసుకోనివారి జాబితాలో దాదాపు 98 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. ఈనెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోకపోతే వారందరికీ సెప్టెంబరులో రేషన్ పంపిణీ ఆగిపోనుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులుండగా... 4,31,84,543 మంది పేదలు సరుకులు పొందుతున్నారు. ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేసుకున్నవారికి మాత్రమే వచ్చే నెలలో రేషన్ అందుతుంది.
ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన హెడ్లైన్ షోలో వెల్లంకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం చాలా దుర్మార్గంగా ఉందన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అరకొర పనులతో బతుకుతున్నామన్నారు. ఇప్పుడు ఈకేవైసీ లింకు పెట్టి.. రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలను ఆధార్ కేంద్రాల వద్ద క్యూలో నిలబెట్టిందని మండిపడ్డారు. అక్కడ సర్వర్ పనిచేయడంలేదని, ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నామన్నారు. ప్రభుత్వం పెట్టిన డెడ్లైన్ లోపల ఈ ప్రక్రియ పూర్తికాదని, సుమారు కోటి మంది రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు సరిగా పట్టించుకోవడంలేదన్నారు. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలంటే ప్రభుత్వం మరో నెల రోజులు గడువు ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Updated Date - 2021-08-18T17:15:49+05:30 IST