ఎంత కష్టం!
ABN, First Publish Date - 2021-05-02T07:14:28+05:30
కాకినాడ గంజాంవారివీధికి చెందిన ఓ 46 ఏళ్ల మహిళ కొవిడ్తో నాలుగు రోజుల కిందట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కోసం కొవిడ్ బాధితుల బంధువులు పడరానిపాట్లు
పేషెంట్ను బతికించుకోవాలంటే ఇంజక్షన్ తెచ్చివ్వమంటున్న ప్రైవేటు ఆసుపత్రులు
ఎక్కడ దొరుకుతాయో తెలియక తలపట్టుకుంటున్న కుటుంబ సభ్యులు
ఏంచేయాలో పాలుపోక కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న వైనం
అధికారులేమో ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే సొంత ఇండెంట్కే ఆచితూచి అంగీకారం
చేతికి అందాక ఇంజక్షన్లను అసలు బాధితులకు ఇవ్వకుండా కొన్ని ఆసుపత్రుల దారి మళ్లింపు
పోనీ బయట కొందామంటే వేలకు వేలు వెచ్చించినా దొరకని పరిస్థితి
కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడే రెమ్డెసివిర్ ఇంజక్షన్ సకాలంలో అందక నిత్యం జిల్లాలో ఎందరో వైరస్ బాధితులు చికిత్స మధ్యలో కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతోపాటు డబ్బులు చెల్లించి చేరే బాధితుల పరిస్థితి ఆందోళనకరం గా ఉంటోంది. పరిస్థితి విషమించిన సందర్భంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్ తెచ్చి ఇవ్వాలంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఖరాకండీగా చెబుతున్నాయి. దీంతో అవెక్కడ దొరుకుతాయో తెలియక, కలెక్టరేట్ చుట్టూ బాధితుల బంధువులు పడిగాపులు పడుతున్నారు. కలెక్టరేట్ అధికారులేమో తాము ఇవ్వమని, చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఇండెంట్ వస్తే ఇస్తున్నాం కదా అని చెబుతున్నారు. దీంతో అటు ప్రైవేటు ఆసుపత్రులు, ఇటు అధికారుల తీరుతో బాధితుల కుటుంబ సభ్యులు నరకయాతన పడుతున్నారు. బయట కొందామంటే ఎక్కడా దొరకడం లేదు. దీంతో కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ గంజాంవారివీధికి చెందిన ఓ 46 ఏళ్ల మహిళ కొవిడ్తో నాలుగు రోజుల కిందట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో యుద్ధప్రాతిపదికన రెమ్డెసివిర్ ఇంజక్షన్ తెచ్చి ఇస్తే ప్రాణాలు నిలుపుతామని సదరు ప్రైవేటు ఆసుపత్రి శనివారం మధ్యాహ్నం చెప్పింది. డబ్బులు చెల్లిస్తాం మీరే ఇంజక్షన్ చేయండని బంధువులు ఆసుపత్రిని కోరగా, తమ వద్ద ఉండవని, కలెక్టరేట్లో అధికారులు ఇస్తారని చెప్పారు. తీరా అక్కడికి వెళ్తే ఇంజక్షన్లు వ్యక్తులకు ఇవ్వమని, సంబంధిత ప్రైవేటు ఆసుపత్రి రోగుల వివరాలతో ఆర్డరు పెడితే ఇంజక్షన్ ఇస్తామని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని తిరిగి ఆసుపత్రికి చెబితే మేం ఏం చేయలేమని, తమ వద్ద ఇంజక్షన్ లేదని చేతులెత్తేశారు. మళ్లీ ఆ బాధితురాలి బంధువులు కలెక్టరేట్కు వచ్చి చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రి పేరు, పేషెంట్ పేరు జేసీకి అందించారు. తీరా జేసీ శనివారం ఉదయమే ఆ ఆసుపత్రి ఇంజక్షన్లు తీసుకువెళ్లారు కదా? అని సమాధానం ఇచ్చారు. మళ్లీ ఆసుపత్రికి వెళ్లి విషయం వివరిస్తే ఇంజక్షన్లు ఇతర పేషెంట్ పేరుతో తీసుకున్నామని అందులో మీపేరు లేదని చెప్పారు. దీంతో ఇంజక్షన్ కోసం సదరు బాధితురాలి కుటుం బ సభ్యులు నరకయాతన అనుభవించారు. రోజు మారినా ఇంజక్షన్ మాత్రం దొరకలేదు. కాకినాడలో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేసే హెచ్ఆర్ మేనేజర్ కొవిడ్తో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇంజక్షన్ బయట తెచ్చుకోవాలని ఆసు పత్రి చెప్పింది. తీరా సకాలంలో దొరక్క సదరు యువకుడు చనిపోయాడు. వీరికే కాదు అనేక మంది కొవిడ్ బాధితుల పరిస్థితి ఇదే. సకాలంలో ఇంజక్షన్ దొరక్క అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేరుకు ఇంజక్షన్ నిల్వలు అవసరానికి సరిపడా ఉన్నాయని కలెక్టర్ చెబుతున్నారు. తీరా క్షేత్రస్థాయిలో అవసరానికి ఎవరికీ దొరకడం లేదు. ప్రస్తుతం కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో అనేకమంది కొవిడ్ బాధితుల కుటుంబ సభ్యులు ఈ ఇంజక్షన్ కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఆరు డోసులు అవసరమయ్యే ఈ ఇంజక్షన్ లభ్యత కనాకష్టంగా మారింది. తొలుత మెడికల్ షాపుల్లో దొరికినా బ్లాక్మార్కెట్కు వెళ్లిపోవడంతో ప్రస్తుతం కలెక్టర్, జేసీ సమక్షంలో వీటి వినియోగం జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు సులువుగానే ఇవి అందుబాటులో ఉంటున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినవారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఇందులో చికిత్స తీసుకునేవాళ్లలో ఇంజక్షన్ ఎంతమందికి అవసరమైతే అంతమంది వివరాలతో సంబంధిత ఆసుపత్రులు కలెక్టర్, జేసీకి దరఖాస్తు చేస్తే పరిశీలించి అందులో కొన్ని ఇస్తాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రులు అవసరానికిమించి ఈ ఇంజక్షన్లను అడుగుతున్నాయనే నెపంతో చాలావరకు కోత వేసి ఇస్తున్నారు. తీరా వీటిని కొన్ని ప్రైవేటు ఆసు పత్రులు అసలు బాధితులకు ఇవ్వకుండా రూ.2,500 ఇంజక్షన్ను రూ.40 వేల వరకు బ్లాక్లో విక్రయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే ఇక్కడే అసలు చిక్కొస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిజమైన పేషెంట్కు సకాలంలో ఇది అందడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులేమో బయట నుంచి ఇంజక్షన్ తే వాలంటుంటే, అధికారులేమో ఆసుపత్రులే ఇండెంట్ పెట్టాలంటున్నాయి. ఈ ఇద్దరి మధ్య బాధితుల బంధువులు వీటిని కొని తెచ్చి ఇవ్వలేక, సకాలంలో దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. పోనీ బయట ఎక్కడైనా కొందామంటే దొరకడం లేదని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. మరోపక్క అధికారులేమో రెమ్డెసివిర్ రోజువారీ వచ్చే మొత్తం పాజిటివ్లో కేవలం పది శాతం మందికే ఇంజక్షన్ అవసరం పడుతుందని, కానీ 30 నుంచి నలభై శాతం మంది వీటిని అవసరం లేకుండా వాడేలా ఆసుపత్రులే ప్రోత్సహిస్తున్నాయని చెబుతున్నారు. పైగా జిల్లాలో రోజువారీ వినియోగం ఆధారంగా అమరావతికి ఇండెంట్ పెడుతుంటే వారానికి రెండుసార్లు ఇవి జిల్లాకు వస్తున్నాయి. అయితే ఇన్ని తలనొప్పుల మధ్య నిజంగా అత్యవసరమైన వారికి మాత్రం రెమ్డెసివిర్ దొరక్క బాధితుల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తమవారి ప్రాణాల కోసం ప్రార్థిస్తున్నారు. నేతలు, ఇతర ప్రముఖుల ద్వారా కొందరు సిఫారుసు చేయించుకుంటున్నా ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
Updated Date - 2021-05-02T07:14:28+05:30 IST