ఆ భూములను తిరిగి ఇచ్చేయండి
ABN, First Publish Date - 2021-06-24T07:43:41+05:30
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లో సేకరించిన 2,180 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన జీవో నెం.12 మేరకు రైతులకు తిరిగి ఇచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ పేర్కొన్నారు.
- పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్జి కరికాలవలవన్
కాకినాడ రూరల్, జూన్ 23: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లో సేకరించిన 2,180 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన జీవో నెం.12 మేరకు రైతులకు తిరిగి ఇచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ పేర్కొన్నారు. కాకినాడ సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చే కార్యక్రమంపై కాకినాడ జీఆర్టీ హోటల్లో కలెక్టర్ మురళీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, డీఆర్వో సత్తిబాబు, రెవెన్యూ, పరిశ్రమలు, సెజ్ తదితర విభాగాల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరికాల వలవన్ మాట్లాడుతూ కేటగిరి-1లో 1,357.18ఎకరాల మేర ఎవరి భూములను వారికి ఇవ్వాల్సి ఉండగా కేటగిరి-2లో 821.61 ఎకరాల ప్రత్యామ్నాయ భూములను ఇవ్వాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరితగతిన రైతులపేరిట భూముల రిజిస్ట్రేషన్ను పూర్తిచేసేందుకు కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో చేపట్టిన ముందస్తు సర్వేను పూర్తి చేయాలని, భూ యజమానులు మరణించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేటగిరి-1లో 1341, కేటగిరి-2లో 1131 మంది రైతులకు భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే అధికారులు సమన్వయంతో వాటిని పరిష్కరించాలన్నారు. సమావేశంలో కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-24T07:43:41+05:30 IST