పారిశుధ్యంపై దృష్టి సారించపోతే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2021-10-30T05:11:14+05:30
అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రతపై రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో పరిశుభ్రత కూడా ఒక భాగమేనని, గంటల వ్యవధిలో ఆసుపత్రితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయకపోతే సిబ్బంది ఎవరికీ జీతాలు ఇచ్చేది లేదని హెచ్చరించారు.
- ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య
అడ్డతీగల, అక్టోబరు 29: అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రతపై రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో పరిశుభ్రత కూడా ఒక భాగమేనని, గంటల వ్యవధిలో ఆసుపత్రితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయకపోతే సిబ్బంది ఎవరికీ జీతాలు ఇచ్చేది లేదని హెచ్చరించారు. శుక్రవారం పీవో అడ్డతీగల మండలం యల్లవరం పీహెచ్సీ, ఎంపీపీ పాఠశాల, పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, అడ్డతీగల కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని 18 పీహెచ్సీల్లో గర్భిణులను ప్రసవానికి ముందు 15 రోజులపాటు బర్త్ వెయిటింగ్ హాళ్లలో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అడ్డతీగల, యల్లవరం గ్రామాల్లో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించారు. యల్లవరం ఎంపీపీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని చూశారు. అడ్డతీగల ఆసుపత్రిలో ఎంత మంది గర్భిణులకు బర్త్ వెయిటింగ్ హాలు ఏర్పాటు చేశారో పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో పందుల స్వైరవిహారం, పేరుకుపోయిన చెత్తాచెదారాలపై పీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. సేవాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజల మన్నలు పొందాలని సూచించారు. తాగునీరు, రన్నింగ్వాటర్ పూర్తిస్థాయిలో పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీల్లోని 120 పంచాయతీల్లో మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని కార్యదర్శులను ఆదేశించారు. పర్యటనలో ఎంపీడీవో బాపన్నదొర, తహశీల్దారు శ్రీనివాస్, వీఆర్వో బాలయ్య, వీఆర్ఏలు, వలంటీర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:11:14+05:30 IST