అనపర్తిలో గరుత్మంతుని విగ్రహ పాదాలు ధ్వంసం
ABN, First Publish Date - 2021-12-08T05:30:00+05:30
అనపర్తిలోని పంచాయతీ రామాలయం ప్రాంగణంలో భక్తులు ఏర్పాటు చేసిన గరుత్మంతుడు విగ్రహ పాదాలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
అనపర్తి,
డిసెంబరు 8: అనపర్తిలోని పంచాయతీ రామాలయం ప్రాంగణంలో భక్తులు ఏర్పాటు
చేసిన గరుత్మంతుడు విగ్రహ పాదాలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు
ధ్వంసం చేశారు. పాదాలను పెకలించి విగ్రహాన్ని నేలమట్టం చేసేందుకు
ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ ప్రతినిధులు
పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి
సూర్యనారాయణరెడ్డి, రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అనపర్తి
ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, బీజేపీ నాయకుడు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి
పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విగ్రహ ధ్వంసం ఆకతాయిల పని
అయి ఉండవచ్చని భావిస్తున్నామని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు
చేపట్టాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. అనపర్తిలోని సనాతన ధర్మ
పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి సురేష్శర్మ మాట్లాడుతూ హిందూ
ధర్మాన్ని అపవిత్రం చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని,
బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని
డిమాండ్ చేశారు. సీఐ మాట్లాడుతూ ఆలయ కమిటీ ప్రతినిధి సిరిశెట్టి రామారావు
ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST