క్షేత్రస్థాయిలో సమన్వయం ముఖ్యం
ABN, First Publish Date - 2021-06-24T07:49:04+05:30
జిల్లాలో డీఆర్డీఏ, పశుసంవర్థక శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరిస్తూ పని చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి స్పష్టం చేశారు.
- జాయింట్ కలెక్టర్ రాజకుమారి
భానుగుడి (కాకినాడ), జూన్ 23: జిల్లాలో డీఆర్డీఏ, పశుసంవర్థక శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరిస్తూ పని చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి స్పష్టం చేశారు. వైఎస్సార్ చేయూత పరిధలో ఉన్న జగనన్న జీవక్రాంతి, పాలవెల్లువ కార్యక్రమ లక్ష్యాలను చేరేందుకు యుద్ధప్రాతిపథికన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఆమె కలెక్టరేట్ నుంచి జీవక్రాంతి, పాలవెల్లువ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. వైఎస్సార్ చేయూత కింద రెండో సంవత్సరం జిల్లాలో 2,25,789 మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. 15,825 ఆవులు, గేదెల యూనిట్లు, 3,911 గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించినందున లబ్ధిదారులకు అవగాహన కల్పించి, బ్యాంకర్ల మద్దతుతో పంపిణీకి కార్యచరణ రూపొందించి వారంలో లక్ష్యాలను మించి గ్రౌండింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏపీఎంలు, ఏరియా కో-ఆర్డినేటర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించా లన్నారు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతీరోజూ సమీక్షలు నిర్వహించనున్నామని, అలసత్వం వహించే అధికారులు, సిబ్భందిపై చర్యలు తప్పవన్నారు. లబ్ధిదారుల గుర్తింపు నుంచి యూనిట్ల పంపిణీ వరకు ప్రతీ దశలోనూ క్షేత్ర స్థాయి సిబ్భంది సమన్వయం తప్పనిసరని, పటిష్ట కార్యచరణతో పనిచేసి జిల్లా ముందు వరుసలో నిలిచేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ ఎస్.సూర్యప్రకాశ్, పలువురు అఽధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-24T07:49:04+05:30 IST