నేమాంలో 45,596 లీటర్ల సారా ధ్వంసం
ABN, First Publish Date - 2021-12-04T06:54:33+05:30
సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతల తగ్గింపే ధ్యేయంగా ప్రభుత్వం అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) స్టేట్ డైరెక్టర్ ఎ.రమేష్రెడ్డి తెలిపారు.
- దాని విలువ రూ.1.15 కోట్లు
- హాజరైన ఎస్ఈబీ స్టేట్ డైరెక్టర్, జిల్లా ఎస్పీ
సర్పవరం జంక్షన్, డిసెంబరు 3: సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతల తగ్గింపే ధ్యేయంగా ప్రభుత్వం అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) స్టేట్ డైరెక్టర్ ఎ.రమేష్రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసులు, ఎస్ఈబీల ఆధ్వర్యంలో పలు కేసుల్లో సీజ్ చేసిన రూ.1.15 కోట్ల విలువైన 45,596 లీటర్ల సారాను జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు ఆధ్వర్యం లో శుక్రవారం కాకినాడ రూరల్ నేమాం బీచ్రోడ్డులో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం మత్తులోపడి ఎన్నో కుటుంబాల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. గత జూలైలో 20 వేల లీటర్ల సారా ధ్వంసం చేశామని, ఇటీవల ఏపీ-ఒడిశా బోర్డర్లో సుమారు 6 వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామన్నారు. కాకినాడ, అమలాపురం ఎస్ఈబీ డివిజన్ స్టేషన్ల పరిధిలో 26,883.1 వేల లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 1837 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ పోలీస్స్టేషన్ల పరిధిలో 18,718 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 1161 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ ఎ రమాదేవి, ఏసీ ఎం.జయరాజుల సమక్షంలో ఈ నాటుసారాను ధ్వంసం చేశారు. గ్రామ సర్పం చ్ రాందేవు సూర్యభాస్కరరావు (చిన్న), ఏఎస్పీ కె.కుమార్, ఆర్మ్డ్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, డీఎస్పీలు భీమారావు, పి. మురళీకృష్ణారెడ్డి, సీఐలు ఏ మురళీకృష్ణ, శ్రీనివాస్, ఎస్ఈబీ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-12-04T06:54:33+05:30 IST