పలుచోట్ల వైసీపీ నిరసనలు
ABN, First Publish Date - 2021-10-21T07:09:42+05:30
ముఖ్యమంత్రి జగన్ పట్ల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బుధవారం జిల్లాలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
తిరుపతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి జగన్ పట్ల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బుధవారం జిల్లాలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఆ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను తగులబెట్టాయి. శ్రీకాళహస్తి మండలం వాంపల్లెలో ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ పెళ్ళి మండపం కూడలిలో ధర్నా చేపట్టిన అనంతరం చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలు దహనం చేశారు. పీలేరులో అంబేడ్కర్ విగ్రహం ఎదుట, కలికిరిలో గాంధీ విగ్రహం ఎదుట వైసీపీ కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుర్రంకొండలో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు. వి.కోట పట్టణంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను తగులబెట్టగా రామకుప్పంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరులో రాష్ట్ర ఫోక్ అకాడమీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం నాయకత్వంలో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. చౌడేపల్లెలో ర్యాలీ నిర్వహించగా సోమలలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. సదుంలో వైసీపీ శ్రేణులు టీడీపీ నేత పట్టా భి వ్యాఖ్యల పట్ల నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశాయి. పాకాలలో అధికార పార్టీ నాయకులు ర్యాలీ జరపగా, జీడీనెల్లూరు బ స్టాండు కూడలిలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలకు నిప్పు పెట్టారు.శ్రీరంగరాజపురం, పెనుమూరుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం మండలాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశాయి.
Updated Date - 2021-10-21T07:09:42+05:30 IST