‘మా తల్లి ఏమైంది.. అసలు బతికుందా లేదా?’
ABN, First Publish Date - 2021-05-17T18:02:57+05:30
‘మా తల్లి ఏమైంది? అసలు బతికుందా లేదా? ఒకవేళ చనిపోయి ఉంటే ఆమె మృతదేహాన్ని మాకు అప్పగించండి’
చిత్తూరు : ‘మా తల్లి ఏమైంది? అసలు బతికుందా లేదా? ఒకవేళ చనిపోయి ఉంటే ఆమె మృతదేహాన్ని మాకు అప్పగించండి’ అంటూ చిత్తూరు కన్నయ్య నాయుడు కాలనీకి చెందిన సుల్తాన్, అతడి కుటుంబీకులు వేడుకున్నారు. చిత్తూరు ప్రెస్క్లబ్లో ఆదివారం వీరు మాట్లాడుతూ.. తమ తల్లి నూర్జహాన్కు జ్వరం రావడంతో ఈనెల 10న చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామన్నారు. అక్కడి సిబ్బంది 15 నిమిషాలు ఆక్సిజన్ అందించి ఆర్వీఎస్ ఆస్పత్రికి తీసుకుపోవాలని సూచించారన్నారు. అక్కడికి తీసుకెళ్లినా పరిస్థితి సరిగాలేకపోవడంతో 11న చిత్తూరు ఆస్పత్రికి తీసుకొచ్చి కొవిడ్ వార్డులో ఆడ్మిట్ చేశామన్నారు. అప్పట్నుంచి డాక్టర్లు, సిబ్బంది తమ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ రోజున ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగినా చెప్పలేదన్నారు. తెలిసిన వ్యక్తుల ద్వారా వాకబు చేయగా, తమ తల్లి మృత్యువాతపడి నాలుగు రోజులు గడిచిందని చెప్పారని కంటతడి పెట్టారు. ఆస్పత్రి సిబ్బంది తమ తల్లి అవయవాలు అమ్మేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి వివరాలు చెప్పాలని, లేదా చనిపోయి ఉంటే మృతదేహాన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-05-17T18:02:57+05:30 IST