చిరుత మృతి కేసులో ఇద్దరి అరెస్టు
ABN, First Publish Date - 2021-10-20T06:22:07+05:30
చిరుత పులి మృతి కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 19: చిరుత పులి మృతి కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీ పశ్చిమ విభాగం డీఎఫ్వో రవిశంకర్ తన కార్యాలయంలో మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. తవణంపల్లె మండలం మడవనేరిలోని చినపాపమ్మ పొలంలో అదే గ్రామానికి చెందిన బాలాజీ (55), మాధవన్ (46) అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకుని మృతి చెందింది. నిందితులను సోమవారం ఉదయం 7.30 గంటలకు గ్రామంలోని మూలస్థానం ఎల్లమ్మగుడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. సమగ్రంగా విచారించాక మంగళవారం వీరిపై అటవీ శాఖ చట్టం కింద కేసు నమోదు చేశారు. అడవి జంతువులను వేటాడే వారికి 3-7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని డీఎఫ్వో తెలిపారు. కాగా తవణంపల్లె మండల వైశువైద్యాధికారి పల్లవి ఆధ్వర్యంలో చిరుత మృతి చెందిన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించామన్నారు. చిరుత వయసు ఐదేళ్లు కాగా.. 24 దంతాలు ఉన్నాయని చెప్పారు. మృతి చెందకముందు అడవి పందిని వేటాడినట్లు రిపోర్టు ద్వారా తెలిసిందన్నారు. సమావేశంలో ఎఫ్ఆర్వో సుభాష్, డీఆర్వో శివరాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-20T06:22:07+05:30 IST