టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు: ఎమ్మెల్సీ దొరబాబు
ABN, First Publish Date - 2021-02-25T04:36:40+05:30
ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే చిత్తూరు నగర మేయర్ పీఠం టీడీపీదేనని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు.
చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 24: ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే చిత్తూరు నగర మేయర్ పీఠం టీడీపీదేనని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే నామినేషన్ వేసిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులను బెదిరించడంతో పాటు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని, నగరపాలక పరిధిలోని మొత్తం యాబై డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు బరిలో వుంటారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ ఇటీవల నాలుగు విడతలుగా జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు టీడీపీ మద్దతుదారులను చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు చెప్పడం దారుణమన్నారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలో వున్నపుడు జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఎలాంటి భద్రత కల్పించారో ఒకసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారుతుంటాయన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. అధికార పార్టీకి తొత్తులాగా మారి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేస్తే భవిషత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. చిత్తూరు నగర అడ్హక్ కమిటీ కన్వీనర్ కఠారి ప్రవీణ్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో నగరంలోని అనేక కాలనీల్లో రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. నగర ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశామన్నారు. గత అభివృద్ధిని చూసి ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు షణ్ముగం, కాజూరు బాలాజి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-25T04:36:40+05:30 IST