గ్రాంట్లతో కాకుండా విరాళాలతో ఎస్వీబీసీ నిర్వహణ
ABN, First Publish Date - 2021-12-03T07:07:43+05:30
ఇప్పటి వరకు టీటీడీ గ్రాంట్లతో నిర్వహిస్తున్న ఎస్వీ భక్తిఛానల్ను, ఇకపై భక్తులు ఇచ్చే విరాళాలతో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సూచించారు.
ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న టీటీడీ ఛైర్మన్
ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు గోశాలలకూ టీటీడీ అండ
తిరుపతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు టీటీడీ గ్రాంట్లతో నిర్వహిస్తున్న ఎస్వీ భక్తిఛానల్ను, ఇకపై భక్తులు ఇచ్చే విరాళాలతో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సూచించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన అధికారులతో సమీక్షించారు. గతంలో కోటి మంది ఛానల్ను వీక్షిస్తుంటే ఇప్పుడు ఏడు కోట్ల మంది వీక్షిస్తున్నారన్నారు. ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు దక్షిణాదిలోని పారిశ్రామిక వేత్తల నుంచి సి.ఎ్స.ఆర్. ఫండ్స్ను సేకరించి, దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రైవేటు గోశాలల సంరక్షణకు టీటీడీ తోడ్పాడు అందిస్తుందన్నారు. ఇందుకోసం పీఠాధిపతులతో గో మహా సమ్మేళనం నిర్వహించినట్టే, పారిశ్రామిక వేత్తలతోనూ నెలలోపు నిర్వహించాలని ఆదేశించారు. ఇటీవల విశాఖలో దీపోత్సవం నిర్వహించినట్టే ప్రతి నెలా ఒక భారీ ధార్మిక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఒక జిల్లాలోనూ, ఇతర రాష్ట్రాల్లో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు విశ్వనాథ్, మురంశెట్టి రాములు, విద్యాసాగర్, మల్లీశ్వరి, ఎస్వీబీసీ ఛైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏ సీఏవో బాలాజి, ఎస్వీబీసీ సీఈవో సురేష్ కుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల సమన్వయకర్త విజయ సారథి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-03T07:07:43+05:30 IST