పెద్దశేష, హంస వాహనాలపై అమ్మవారు
ABN, First Publish Date - 2021-12-02T06:35:27+05:30
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం పెద్దశేష, రాత్రి హంసవాహనంపై అమ్మవారిని ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు.
తిరుచానూరు, డిసెంబరు 1: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం పెద్దశేష, రాత్రి హంసవాహనంపై అమ్మవారిని ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు. ఉదయం నిత్యకైంకర్యాలు నిర్వహించాక అమ్మవారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపు చేశారు. శంకు చక్ర గదాధారుడైన వైకుంఠనాథుడి అలంకారంలో పెద్దశేష వాహనంపై అధిష్ఠింపచేశారు. మధ్యాహ్నం ఆలయంలోని కేటీ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వాహన మండపంలో ఉత్సవమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి వీణ చేతబట్టి సరస్వతీదేవిగా అలమేలుమంగ హంస వాహనంపై కొలువుదీరారు. ఏకాంతంగా జరిగే ఈ వాహన సేవలకు టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బంది మినహా ఎవరినీ అనుమతించలేదు. ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్రెడ్డి, ఏవీఎస్వో వెంకటరమణ, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ జయకుమార్, రాజేష్, దాము, వీఐలు మహేష్, సురే్షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి, రాత్రి సింహవాహనసేవ జరగనుంది.
Updated Date - 2021-12-02T06:35:27+05:30 IST