వేరుశనగ సాగుకు సమాయత్తం
ABN, First Publish Date - 2021-06-10T05:48:19+05:30
సకాలంలో వర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఆశాజనకంగా ప్రారంభమైంది.
బి.కొత్తకోట, జూన్ 9: సకాలంలో వర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఆశాజనకంగా ప్రారంభమైంది. పొలం దుక్కులు దున్నుకుని వేరుశనగ విత్తనాలు వేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. వేరుశనగ విత్తన ధరలు అధికంగా వున్నప్పటికీ వర్షాలు బాగా పడవచ్చనే అంచనాతో రైతులు ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. మదనపల్లె వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో సుమారుగా 35 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగవుతోంది.రెండు సంవత్సరాలుగా వాతావరణ మార్పుల వలన వేరుశనగ పంట రైతులకు మంచి ఫలితాన్నివ్వలేదు.ఈ ఏడాదైనా పంటలు బాగా పండించాలనే ఆశతో రైతులు వేరుశనగ విత్తన కాయలు కొనుగోలు చేసి వాటిని ఒబ్బిడి చేసి పొలాల్లో వేస్తున్నారు.ఎకరం విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇటీవల ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చిన రాయితీ విత్తనకాయలు సరిపోవు కాబట్టి మార్కెట్లో కొనుగోలు చేసి వేస్తున్నారు.
Updated Date - 2021-06-10T05:48:19+05:30 IST