పెరుగుతున్న ధరలతో ఆకలిచావులే
ABN, First Publish Date - 2021-10-29T07:24:51+05:30
ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరలు ఇలా అడ్డూఅదుపూ లేకుండా రోజువారీ పెరుగుతుంటే ప్రజలకు ఆకలి చావులు తప్పవని వామపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 28: ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరలు ఇలా అడ్డూఅదుపూ లేకుండా రోజువారీ పెరుగుతుంటే ప్రజలకు ఆకలి చావులు తప్పవని వామపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ గురువారం వామపక్ష పార్టీలు జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. సీపీఎం నేత కందారపు మురళి,సీపీఐ నాయకుడు పి.మురళి ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక కార్యాలయం ముందు జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న ధరలతో ప్రజలు ఏమీ కొని తినలేని పరిస్థితి దాపురించడం బాధాకరమన్నారు. ఆదాని, అంబానీ కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అన్నం పెట్టే రైతులను వ్యవసాయం నుంచి వెలివేయడానికి నల్లచట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు.తమ పోరాటాలకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతివ్వాలని కోరారు. సీపీఎం, సీపీఐ నాయకులు టి. సుబ్రహ్మణ్యం, జె.విశ్వనాథ్, సుశీ, హరీష్, ఆర్.లక్ష్మి, బుజ్జి, రాధ, సుజాతమ్మ, జయంతి, వేణుగోపాల్, గురుప్రసాద్, ఎండీ శీను, జీవీ రమణయాదవ్, శ్రీరాములు, నారాయణస్వామి, రవి, శివ, రామచంద్ర, నదియా, మంజుల, ఎస్ఎ్ఫఐ నాయకులు మాధవ్, అర్బర్, రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T07:24:51+05:30 IST