చదువంటే ఇష్టం లేక
ABN, First Publish Date - 2021-01-16T06:33:31+05:30
డిగ్రీ చేరడం ఇష్టం లేక మదనపల్లె మండలం పాకాలవారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు
పాకాలవారిపల్లె విద్యార్థి ఆత్మహత్య
మదనపల్లె క్రైం, జనవరి 15: చదవడం ఇష్టంలేక మదనపల్లె మండలం పాకాలవారిపల్లెకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకా ఎస్ఐ దిలీ్ప కుమార్ కథనం మేరకు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ పాకాలవారిపల్లెకు చెందిన వి.అనిల్ కుమార్(19) ఇంటర్ పూర్తి చేశాడు. దీంతో మెరుగైన విద్య కోసం విద్యార్థిని తిరుపతిలో డిగ్రీ చేర్చేందుకు ఆయన తండ్రి వరగాని మోహన్ ప్రయత్నించారు. ఆ మేరకు ఇటీవల తిరుపతికి వెళ్లిన అనిల్ గురువారం స్వగ్రామానికి వచ్చాడు. దీంతో తరచూ ఇంటికి వస్తే చదువు దెబ్బతింటుందనీ, అక్కడే ఉండి బాగా చదువుకోవాలని కుమారుడికి మోహన్ సూచించారు. కాగా, శుక్రవారం ఉదయం పశువులను మేత కోసం పొలం వద్దకు తీసుకు వెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లడం గుర్తించి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా గుర్తించిన స్థానికులు బాధితుడిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అనిల్ను పరీక్షించిన వైద్యులు మార్గమధ్యంలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఒక్కగానొక్క కుమారుడు దూరమవడంతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవడం ఇష్టంలేకనే ఒక్కగానొక్క బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ తాలూకా పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2021-01-16T06:33:31+05:30 IST