గజవాహనంపై మోక్షప్రదాయని
ABN, First Publish Date - 2021-12-05T07:17:46+05:30
శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి గజవాహనసేవ వాహన మండపంలో నయనానందకరంగా సాగింది.
వేడుకగా లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
తిరుచానూరు, డిసెంబరు 4: శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి గజవాహనసేవ వాహన మండపంలో నయనానందకరంగా సాగింది. తనకిష్టమైన కరిరాజుపై అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో అభయమిచ్చారు. రత్నఖచిత స్వర్ణాభరణాలతో పాటు తిరుమల ఆలయం నుంచి తీసుకొచ్చిన లక్ష్మీకాసుల హారం ధరించి కనువిందు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.అమ్మవారిని విశేష అలంకారంలో స్వర్ణకమలం తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తూ అర్చకులు, టీటీడీ అధికారులు చందనం కలిసిన నీళ్లను భక్తులపై చల్లుతూ వేడుకగా వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం అద్దాల మండపంలో పట్టు పీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో పద్మావతిదేవిని జగన్మోహినిగా అలంకరించి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు.పున్నమి గరుడసేవ సందర్భంగా శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీకాసులహారాన్ని శనివారం ఉదయం తిరుమలనుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి మూలవర్లకు అలంకరించారు.చెన్నైలోని తిరునిండ్రకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు.ముంబైకి చెందిన శంకరనారాయణ రూ. 6లక్షల విలువచేసే ఆభరణాలను కానుకగా అందించారు.తుమ్మలగుంట నుంచి పాదయాత్రగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పట్టువస్త్రాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. తిరుచానూరు వద్ద ఆయనకు సర్పంచ్ రామచంద్రారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్రెడ్డి, ఉప సర్పంచ్ జమున స్వాగతం పలికారు.జియ్యర్స్వాములు, టీటీడీ ఈవో జవహర్రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం,డిప్యూటీ ఈవో కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-05T07:17:46+05:30 IST