ఉద్యోగులు సేవాతత్వం పెంచుకోవాలి: సీఎండీ
ABN, First Publish Date - 2021-06-22T06:57:43+05:30
ఉద్యోగులు తమ విధులతో పాటు సామాజిక సేవలు అందించడాన్నీ అలవరచుకోవాలని సదరన్ డిస్కం సీఎండీ హెచ్.హరనాథరావు సూచించారు.
తిరుపతి(ఆటోనగర్), జూన్ 21: ఉద్యోగులు తమ విధులతో పాటు సామాజిక సేవలు అందించడాన్నీ అలవరచుకోవాలని సదరన్ డిస్కం సీఎండీ హెచ్.హరనాథరావు సూచించారు. తిరుపతిలో 26 రోజులుగా సామాజిక సేవలు అందించిన ఉద్యోగులను సోమవారం ఆయన విద్యుత్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో అభినందించారు. ఈ సేవలు చేసిన ఉద్యోగులకు ఆయన నగదు, బియ్యం అందించి మాట్లాడారు. తిరుపతి స్మార్టుసిటీ పరిధిలోని ఆస్పత్రుల వద్ద 26 రోజులుగా 13వేల మంది కరోనా బాధితుల సహాయకులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు, నీళ్ల బాటిళ్లు అందించడం అభినందనీయమన్నారు. దీనికి ఆర్థిక సహాయం అందించిన ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ డి.వెంకటాచలపతి, ఈఈ వాసుదేవరెడ్డి,(తిరుపతి రూరల్), డీవైఈఈ బాబు, విష్ణువర్ధన్ (సివిల్), ఎస్ఏవో మురళీకుమార్, 1104 ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిస్కం నేత దేవేంద్రరెడ్డి, ఏఏవో శివశంకర్, చందు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-22T06:57:43+05:30 IST