40 గొర్రెలను చంపేసిన కుక్కలు
ABN, First Publish Date - 2021-03-03T06:32:04+05:30
కుక్కల దాడిలో 40 గొర్రెలు చనిపోయాయి.
రూ.5లక్షల నష్టం
ఎర్రావారిపాళెం, మార్చి 2: కుక్కల దాడిలో 40 గొర్రెలు చనిపోయాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రావారిపాళెం మండలం కమళ్లయ్యగారిపల్లె పంచాయతీ బడగనపల్లె దిగువపల్లెకి చెందిన చింటమ్ నాగేశ్వర ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. రోజులాగానే జీవాలను మేపుకుని సోమవారం సాయంత్రం తిరిగొచ్చాడు. ఇంటికి ఆనుకుని ఉన్న దొడ్డిలోకి జీవాలను తోలాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేశాక మరోసారి గొర్రెలదొడ్డిని పరిశీలించి, నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక కుక్కల మంద దొడ్డిలోకి ప్రవేశించి, 40 గొర్రెలను కొరికి చంపేశాయి. మంగళవారం వేకువజామున బాధితుడు చూసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. కుక్కల దాడిలో మరణించిన గొర్రెలు దాదాపు రూ.5లక్షల విలువ చేస్తాయని గ్రామస్తులు తెలిపారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2021-03-03T06:32:04+05:30 IST