బస్సులోనే Chandrababu బస.. ఎందుకిలా..!?
ABN, First Publish Date - 2021-10-11T07:37:12+05:30
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో 12, 13, 14 తేదీల పర్యటనలో భాగంగా బస్సులోనే బస చేయనున్నారు.
చిత్తూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో 12, 13, 14 తేదీల పర్యటనలో భాగంగా బస్సులోనే బస చేయనున్నారు. ఆ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 24, 25, 26 తేదీల్లో కుప్పం పర్యటన సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్హౌసులో చంద్రబాబు బస చేశారు. 25న తెల్లవారుజామున 4నుంచి 5 గంటల వరకు.. ఉదయం 7.30 నుంచి 8.30గంటల వర కు గెస్ట్హౌసులో కరెంటు సరఫరా ఆపేశారు. తద్వారా ఆయన నిద్రకు, స్నానానికి ఇబ్బంది కలిగించారు.
అప్పట్లో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్దేశపూర్వకంగా కరెంటును కట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో పాటు గదిని శుభ్రం చేయకపోవడం, బెడ్డు కింద బిర్యాని ముక్కలు, కప్బోర్డులో మందు బాటిళ్ల మూతలు ఉండటంతో అధికారులపై టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఈ చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి బస్సులోనే బస చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ఆవరణలో బస్సు ఆపి, అందులోనే నిద్ర, స్నానం, భోజనం చేస్తారు. నాయకులతో సమావేశాలను మాత్రం అతిథి గృహంలో నిర్వహిస్తారు.
కాగా, మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తొలిరోజు మధ్యాహ్నం కుప్పం ఆర్అండ్బీ గెస్ట్హౌ్సకు చేరుకుని.. 3.30గంటలకు బస్టాండులో బహిరంగ సభ.. సాయంత్రం 4.30 గంటలకు కుప్పం మాజీ సర్పంచ్ గోపినాథ్ ఇంటికెళ్లి ఆయన కుమారుడు, కోడలును ఆశీర్వదిస్తారు. అనంతరం ఇటీవల మృతి చెందిన కుప్పం మాజీ సర్పంచ్ దయాసాగర్ కుటుంబీకుల పరా మర్శ.. 5.15 గంటలకు కుప్పంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమావేశం ఉంటుందని చంద్రబాబు పీఏ మనోహర్ తెలిపారు.
Updated Date - 2021-10-11T07:37:12+05:30 IST