కన్నుల పండువగా మకర జ్యోతి దర్శనం
ABN, First Publish Date - 2021-01-16T06:36:48+05:30
సదుం యర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
సదుం, జనవరి 15: సదుం యర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ తూర్పు దిక్కున కొండల్లో శుక్రవారం సాయంత్రం భక్తులకు మకర జ్యోతి దర్శనభాగ్యం కలిగింది. మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏటా ఆలయ ధర్మకర్త మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మకర జ్యోతి దర్శన ఏర్పాట్లు జరుగుతుండటం ఆనవాయితీ. సాయంత్రం మంత్రి కుటుంబ సమేతంగా స్థానిక సదుమమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అయ్యప్పస్వామి వారి తిరు ఆభరణాలను మంత్రి నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అయ్యప్పస్వామి సన్నిధానానికి చేరుకుని ఆలయ ప్రధానార్చకులకు అందజేశారు. అనంతరం తిరు ఆభరణాలతో అలంకరించిన స్వామివారు భక్తులను కటాక్షించారు. తూర్పు దిక్కున కొండలపై నుంచి జ్యోతి దర్శనంతో భక్తులు పరవశించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాలధారణ అయ్యప్ప భక్తులు ఇరుముడులు చెల్లించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, చెవిరెడ్డి, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-16T06:36:48+05:30 IST