ఏపీని గంజాయాంధ్ర ప్రదేశ్గా మార్చేస్తున్నారు
ABN, First Publish Date - 2021-10-29T07:04:10+05:30
రాష్ట్రాన్ని గంజాయాంధ్ర ప్రదేశ్గా వైసీపీ ప్రభుత్వం మార్చేస్తోందని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన విమర్శ
ఎస్టీ, ఎస్సీ సబ్ప్లాన్ నిధులు ఏమయ్యాయని ప్రశ్న
తిరుపతి(తిలక్రోడ్డు), అక్టోబరు 28: రాష్ట్రాన్ని గంజాయాంధ్ర ప్రదేశ్గా వైసీపీ ప్రభుత్వం మార్చేస్తోందని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాకు నిరసనగా తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా ఏపీ గంజాయేనని అక్కడి పోలీసులు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మద్యం, ఇసుక, మట్టి, గంజాయి మాఫియాల పాలన సాగిస్తూ ఎస్సీ, ఎస్టీ, పేదల జీవితాలను సీఎం జగన్ నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను వారి అభివృద్ధికి ఖర్చు చేయకుండా నవరత్నాలకు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్రాయల్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గంజాయికి కేరా్ఫగా మార్చి, యువతను మత్తువైపు మళ్లించేలా జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులే విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలు కాకుండా ఉండేందుకు జనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమకేసులు బనాయించేందుకు పోలీసులు ఉపయోగపడుతున్నారే తప్ప ప్రజలకు రక్షణ కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో రాజారెడ్డి, బి.మధుబాబు, మునస్వామి, సుమన్, రాజేష్, అమృత, చిన్నారాయల్, అనంద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T07:04:10+05:30 IST