ఆగని ఆర్తనాదాలు
ABN, First Publish Date - 2021-05-03T09:59:56+05:30
ఆగని ఆర్తనాదాలు
వెంటిలేటర్ బెడ్కోసం ఎదురుచూస్తూ..
అంబులెన్స్లోనే కన్నుమూసిన విద్యార్థి
ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదం
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరో ఘోరం
మెట్ల మీద యువకుడి మృతదేహం
కొవిడ్ చికిత్స కోసం తెచ్చిన బంధువులు
అడ్మిషన్ దొరక్క అక్కడే వదిలేసి పోయారు
3గంటలు నరకం అనుభవించి మృతి
ఏలూరు విజయవాడ, ఎడ్యుకేషన్, మే 2: కరోనా బారినపడిన కుమారుడిని రక్షించుకునేందుకు ఆ తండ్రి చేయని ప్రయత్నం లేదు. రెండు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తిప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వద్దకు తరలించారు. కొందరు నాయకులను పట్టుకొని కూడా ప్రయత్నించారు. ఎక్కడకు వెళ్లినా ఒకటే సమాధానం.. వెంటిలేటర్తో కూడిన బెడ్లు లేవు చికిత్స కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో అంబులెన్సులోనే తన కుమారుడు కొడిగట్టిపోవడం చూపి ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఈ విషాదం చోటుచేసుకొంది.
వివరాల్లోకి వెళితే... పెంటపాడు మండలం కె.పెంటపాడులోని మండల పరిషత్ పాఠశాల (నం.1)లో టీచర్గా పనిచేస్తున్న సింగులూరి వేణుగోపాలరావుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మణికంఠ(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వారం క్రితం దగ్గు, జ్వరం రావడంతో తాడేపల్లి గూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించారు.
ఈ పరీక్షల్లో కొవిడ్ నెగిటివ్ వచ్చింది. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తణుకులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. సిటీ స్కాన్ లో పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. అక్కడి నుంచి మళ్లీ తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి చేర్పించారు. మణికంఠకు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో.. మెరుగైన వైద్యంకోసం ఆదివారం ఉదయం హుటాహుటిన అంబులెన్సులో మణికంఠను తీసుకుని తండ్రి వేణుగోపాలరావు ఏలూరు వచ్చారు. అక్కడ రెండు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సంప్రదించినా..వెంటిలేటర్ ఉన్న బెడ్లు దొరకలేదు. చివరిగా ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్లో మణికంఠకు ఆక్సిజన్ అందిస్తూ.. తండ్రి తన ప్రయత్నాలు కొనసాగించారు. అప్పటికే మణికంఠ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి.
అడ్మిషన్ కోసం ప్రభుత్వాస్పత్రి అధికారులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు స్వయంగా మాట్లాడారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని బెడ్లు ఖాళీ అవుతాయని, అప్పటివరకు తామేం చెప్పలేమని సమాధానం వచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలోనైనా జాయిన్ చేయించి రక్షించుకుందామని వేణుగోపాలరావు ప్రయత్నాలు చేశారు. ఇంతలోనే అంబులెన్సులో వైద్యం కోసం ఎదురుచూస్తున్న మణికంఠ మధ్యాహ్న సమయంలో తుది శ్వాస విడిచాడు. కాగా, మణికంఠ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
అయ్యో.. ఇంత ఘోరమా?
ఆ యువకుడు ఎవరో తెలియదు. ఎవరు తెచ్చి విజయవాడ ప్రభుత్వాస్పత్రి మెట్ల మీద వదిలేశారో తెలియదు. దాదాపు మూడు గంటలపైనే ఆక్సిజన్ కోసం తన్నుకొని.. తన్నుకొని ఆ మెట్లపైనే తుదిశ్వాస విడిచాడు. 30-35 ఏళ్ల మధ్య ఉన్న ఈ యువకుడిని కొవిడ్ చికిత్స కోసం తెచ్చినట్టు భావిస్తున్నారు. మృతదేహం మెట్ల మీద పడి ఉన్నదని.. చికిత్స కోసం వచ్చినవారు చెబితేగానీ వైద్యులకు తెలియలేదు. కొన్ని పరీక్షలు చేసి మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆస్పత్రి పరిసరాల్లో కలకలం రేపిన ఈ ఘటనపై వివరాలు చెప్పడానికి ఆయన తరఫు ఎవరూ అక్కడ లేరు. వైద్యం కోసం వచ్చినవారు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఓ కుటుంబం.. ఆ యువకుడిని తీసుకొని ఆస్పత్రి వద్దకు వచ్చింది. గంట, గంటర్నర తర్వాత ఆ వచ్చిన వారు కనిపించలేదు. యువకుడు మాత్రమే మెట్ల మీద కూర్చొని ఉన్నాడు.
దాహం అంటే... ఎవరో వచ్చి మంచినీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత కూర్చోలేక మెట్లపైనే పడుకొన్నాడు. శ్వాస తీసుకోవడం చాలా కష్టమయింది. అలాగే అవస్థలు పడుతూ కొద్దిసేపు ఆక్సిజన్ కోసం అల్లాడిపోయాడు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ప్రాణం పోయింది. అంతసేపూ ఆస్పత్రి సిబ్బంది కనీసం అటువైపు తొంగి కూడా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కొవిడ్ చికిత్స కోసం ఆయన కుటుంబం తెచ్చి ఉంటుందని.. అడ్మిషన్ లేదనేసరికి, వెంట తీసుకెళ్లడం ఇష్టం లేక అక్కడే వదిలేసి తమ దారిన తాము వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
Updated Date - 2021-05-03T09:59:56+05:30 IST