జగన్కు బాబు ఫోబియా
ABN, First Publish Date - 2021-03-17T09:37:15+05:30
ముఖ్యమంత్రి జగన్కు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా చంద్రబాబు ఫోబియా పట్టుకుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. భౌతికంగా, రాజకీయంగా చంద్రబాబును చంపాలని కుట్రలు
ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూమి
700 ఎకరాలు జగన్ కబ్జా చేశారు: వెంకన్న
విజయవాడ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్కు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా చంద్రబాబు ఫోబియా పట్టుకుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. భౌతికంగా, రాజకీయంగా చంద్రబాబును చంపాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఐడీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం బుద్దా వెంకన్న ఈ అంశంపై ట్విట్టర్ వేదిక స్పందించారు. ‘‘ఇడుపులపాయలో దళితులకు చెందిన 700 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసిన జగన్.. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వింతగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు పెడితే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం మరో వింత. అసలు లేని ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఇన్నిపాట్లు ఎందుకు జగన్రెడ్డి గారూ. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బాబుని టచ్ చేయడం మీ వల్ల కాదు’’ అని స్పష్టం చేశారు. తర్వాత విజయవాడలో మాట్లాడుతూ.. రెండేళ్లలో చంద్రబాబు అనేకసార్లు సవాల్ విసిరినా ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు సీఐడీని అడ్డం పెట్టుకుని నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు.
జగన్ నియంతలా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలతో జగన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలో జగన్ తిరిగినా గతంలో వైసీపీ ఓటమి చెందిందని గుర్తుచేశారు. ఈ నెల 11 వరకు చంద్రబాబు ఇక్కడే ఉన్నారని, అప్పుడేం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుపై అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, అధికారం, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని గెలిచారని విమర్శించారు. వైసీపీ అరాచకాలకు భయపడే ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు రాలేదని, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇదే కారణమన్నారు.
Updated Date - 2021-03-17T09:37:15+05:30 IST