దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష నాకు రాదు : అశోక్ గజపతిరాజు
ABN, First Publish Date - 2021-12-23T17:30:51+05:30
దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని.. అది లేకపోయి ఉంటే తను చైర్మన్ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించేసి ఉండేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
విజయనగరం : దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని.. అది లేకపోయి ఉంటే తను చైర్మన్ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించేసి ఉండేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. దేవాలయాలకు దేవుడే యజమాని అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదన్నారు. తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దృష్టి సారించిందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. రామతీర్ధం కొండపై ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తెలియపరచమని చెప్పినా తన మాట పట్టించుకో లేదన్నారు. ప్రభుత్వంలో దేవాదాయ అంశం భాగం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెబుతున్నా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. ఆనవాయితీలు, సంప్రదాయాలు మంట కలిపారన్నారు. పోలీసులకు చెబితే బూట్లు విప్పారు గానీ, రాజకీయ నాయకులు మాత్రం అమర్యాదగా వ్యవహరించారని అశోక్ గజపతిరాజు వాపోయారు.
Updated Date - 2021-12-23T17:30:51+05:30 IST