మీ సాయం మాకొద్దు.. మా ఊరికి రావొద్దు..!
ABN, First Publish Date - 2021-11-29T08:16:36+05:30
మీ సాయం మాకొద్దు.. మా ఊరికి రావొద్దు..!
తిరుపతి రూరల్లో అధికార యంత్రాంగానికి చుక్కెదురు
తిరుపతి రూరల్, నవంబరు 28: ‘మా బతుకేదో మేం బతుకుతున్నాం. పేరూరు చెరువు నుంచి కలుజు తూముల ద్వారా నీళ్లు మాఊరి వైపు వదిలారు. పాలాలు, రోడ్లూ నీళ్లతో నిండిపోయాయి. చెరువుకు దిగువన గండి కొడితే మాపై లాఠీచార్జి చేసి తలలు పగలగొడతారా? ఇంత జరిగాక.. మీ సానుభూతి, సాయం మాకు అక్కరలేదు. మా ఊరికి రావద్దు’ అంటూ తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ గ్రామస్థులు అధికారులకు తేల్చి చెప్పారు. ఇటీవల భారీ వర్షాలకు పేరూరు చెరువు నిండడంతో ఆ నీటిని పాతకాల్వ వైపు మళ్లించారు. దీంతో పాతకాల్వవాసులు పేరూరు చెరువుకు దిగువన గండి కొట్టారు. దీంతో ఆ ఊరి మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులకు వరద సాయం అందించడానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు, ఎంపీపీ మోహిత్రెడ్డి అధికారులతో కలిసి ఆదివారం గ్రామానికి వచ్చారు. అధికారులు చేసిన తప్పునకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. అయినా గ్రామస్థులు వినలేదు. ‘మాపై కేసులు పెట్టుకోండి.. ఏమైనా చేసుకోండి. మీ సానుభూతి, సాయం మొకొద్దు. మా గ్రామంలోకి కూడా రావొద్దు’ అంటూ ఆగ్రహించారు. దీంతో వరద సాయం అందించకుండానే అధికార యంత్రాంగం వెనుదిరిగింది.
Updated Date - 2021-11-29T08:16:36+05:30 IST