సరుకు రవాణాకు నాలుగు పొడవైన రైళ్లు
ABN, First Publish Date - 2021-10-18T07:42:41+05:30
సరుకు రవాణాకు నాలుగు పొడవైన రైళ్లు
విజయవాడ డివిజన్లో త్రివేణి మిషన్ సక్సెస్
ఒకేరోజు మూడు వేర్వేరు మార్గాల్లో రవాణా
విజయవాడ, హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ పరిధిలో ఆపరేషన్ త్రివేణి మిషన్ను విజయవాడ రైల్వే డివిజన్ ఆదివారం విజయవంతంగా పూర్తిచేసింది. అత్యంత భారీ పొడవైన (అనకొండ) గూడ్స్ రైళ్లను ఒకేరోజు మూడు మార్గాల్లో విజయవంతంగా నడిపిన ఘనతను సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇటీవలే రెండున్నర కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును నడిపి చరిత్ర సృష్టించిన విజయవాడ డివిజన్ మరోసారి.. ఒకేసారి నాలుగు పొడవాటి రైళ్లను నడిపి రికార్డును సృష్టించింది. ఆదివారం విజయవాడ-విశాఖపట్నం మీదుగా తాల్చేరు వరకు (900 కి.మీ దూరం) 118 బోగీలతో కూడిన రెండు భారీ రైళ్లను నడిపింది. విజయవాడ కొండపల్లి మార్గంలో రెండు గూడ్స్ రైళ్లను కలిపి ఒక్కటిగా చేసి 116 బోగీలతో పొడవైన రైలును నడిపింది. అలాగే కృష్ణపట్నం అదాని పోర్టు నుంచి కేసోరామ్ సిమెంట్స్ (645కి.మీ.దూరం) వరకు మరో పొడవైన గూడ్స్ రైలును పంపింది. విజయవాడ డివిజన్ నుంచి నాలుగు పొడవైన రైళ్లను మూడు వేర్వేరు గమ్యస్థానాలకు నడుపుతున్న నేపథ్యంలో.. ఈ వినూత్న కార్యక్రమానికి ‘త్రివేణి మిషన్’ అని పేరు పెట్టారు. రెండేసి గూడ్స్ రైళ్లను ఒకే రైలుగా ఏర్పాటు చేసి నడపడం ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచాలన్నది రైల్వే ఉద్దేశం. అలాగే ఈ రైళ్ల వేగాన్ని పెంచి సరుకును త్వరగా గమ్యస్థానాలకు చేర్చి వ్యాపారాభివృద్ధిని పెంచుకోవాలని భావిస్తోంది. కాగా.. సరుకు రవాణా సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తున్న విజయవాడ డివిజన్ అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఈ సందర్భంగా అభినందించారు.
Updated Date - 2021-10-18T07:42:41+05:30 IST