2వేల కోట్లు ఏం చేస్తారు?
ABN, First Publish Date - 2021-04-09T08:20:58+05:30
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడమే ముఖ్యమని ఇప్పటికే ఒకసారి రుజువైంది. ఇప్పుడు... మరోసారి జీతాలా, బిల్లులా, పథకాలకు చెల్లింపులా? వీటిలో ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సిన అవసరం...
- ఖజానాలో జమ అయిన ‘అప్పు సొమ్ము’
- జీతాలు, పెన్షన్లకు రూ.2500 కోట్లు అవసరం
- రెండు రోజులు గడిచినా ఖర్చుపెట్టని వైనం
- ‘విద్యా దీవెన’ పథకం కోసం వాడతారా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడమే ముఖ్యమని ఇప్పటికే ఒకసారి రుజువైంది. ఇప్పుడు... మరోసారి జీతాలా, బిల్లులా, పథకాలకు చెల్లింపులా? వీటిలో ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే... బుధవారం ప్రభుత్వ ఖజానాలోకి అప్పు రూపంలో రూ.2,000 కోట్లు జమ అయ్యాయి. వాటిని ఏ పద్దు కింద ఖర్చు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా దాదాపు రూ.3,000 కోట్లను వేతనాలు, పెన్షన్ల కింద చెల్లించారు. పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు మరో రూ.2,500 కోట్లు అవసరం. ఇప్పుడు అప్పుగా తెచ్చుకున్న రూ.2వేల కోట్లను ఖర్చు పెడితే... చాలా కొద్దిమందికి మినహా అందరికీ వేతనాలు చెల్లించినట్లు అవుతుంది. బుధవారమే రూ.2వేల కోట్లు అందినప్పటికీ... జీతాలు, పెన్షన్లు చెల్లించే దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో... ఈ మొత్తాన్ని ‘జగనన్న విద్యా దీవెన’ పథకం చెల్లింపుల కోసం పక్కనపెట్టినట్లు భావిస్తున్నారు.
Updated Date - 2021-04-09T08:20:58+05:30 IST