ఆ విషయంలో రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరు: వంగలపూడి అనిత
ABN, First Publish Date - 2021-08-10T21:02:59+05:30
వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగనే కాదు, రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరురని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్ష్యురాలు వంగలపూడి అనిత అన్నారు.
అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగనే కాదు, రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అనిత మీడియాతో మాట్లాడుతూ.. దళితులను ఉద్ధరిస్తున్నామంటున్న వైసీపీ దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. పోలీసుల అండతో దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్రెడ్డి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిపై కోవిడ్ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి, వైసీపీ బహిరంగ సభలకు కోవిడ్ నిబంధనలు గుర్తుకురావా? అని ప్రశ్నించారు. ప్రతిఘటన ర్యాలీని అడ్డు కున్నారంటే దళితులకు న్యాయం చేయలేమని సీఎం జగన్రెడ్డి చేతులెత్తేశారా? అని అనిత నిలదీశారు. సీఎం జగన్రెడ్డి పోలీసు వ్యవస్థను నిందితులను శిక్షించడానికి కాకుండా టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని అనిత దుయ్యబట్టారు.
Updated Date - 2021-08-10T21:02:59+05:30 IST