నెల్లూరులోనే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం
ABN, First Publish Date - 2021-04-08T01:16:04+05:30
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో తిరిగి నెల్లూరులోనే ప్రాచీన తెలుగు విశిష్ట
నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో తిరిగి నెల్లూరులోనే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సేవలను కొనసాగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మైసూరులో నెలకొల్పే భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో ఈ కేంద్రాన్ని కలపాలని నిర్ణయించారు. దీంతో తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందారు. ఈ నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ కార్యదర్శితో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఈ నిర్ణయం మైసూరులోని సంచాలకుల స్థాయిలో జరిగిందని కార్యదర్శి వివరణ ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి కోరిక మేరకు పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అందులో పని చేస్తున్న సిబ్బంది యథావిధిగా విధులకు హాజరు కావాలని సమాచారం అందించారు. ఈ కేంద్రానికి సీఎం జగన్ అయిదు ఎకరాల భూమిని కేటాయించారు.
తెలుగు, కన్నడ, ఒడియా, మలయాళ భాషల విశిష్ట అధ్యయన కేంద్రాలను విలీనం చేసి మైసూరులోని భారతీయ భాషా సంస్థను (సీఐఐఎల్) భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ప్రాచీన భాషల అభ్యున్నతి కోసం తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళ ఒడియా భాషలకు ప్రాచీన హోదా ప్రకటించి అమలు చేస్తోంది.
Updated Date - 2021-04-08T01:16:04+05:30 IST