భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన-నబీ వేడుకలు
ABN, First Publish Date - 2021-10-20T06:07:43+05:30
మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మంగళవారం మిలాద్-ఉన-నబీ వేడుకలను జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతపురం టౌన, అక్టోబరు 19 : మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మంగళవారం మిలాద్-ఉన-నబీ వేడుకలను జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాకేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో జరుపుకున్నారు. ప్రతి మసీదు, మదరసా, దర్గాల నుంచి ముస్లింలు జెండాలు చేతబూని, ’నారే తక్బీర్... అల్లాహు అక్బర్’ అని స్తుతిస్తూ ముందుకు సాగారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ప్రవక్త సూక్తులను పఠిస్తూ, భక్తిగీతాలాపనలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించి సమాజ శ్రేయస్సుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా మతపెద్దలు పిలుపునిచ్చారు. అదేవిధంగా మిలాద్-ఉన-నబీని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ముస్లింలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం దర్గాలు, మసీదులలో మహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశ దర్శనం ఏర్పాటు చేశారు. ముస్లింలతో పాటు కులమతాలకు అతీతంగా ప్రజలు విరివిగా హాజరై ప్రవక్త పవిత్ర కేశాన్ని దర్శించుకున్నారు. జిల్లాకేంద్రంలో పాతూరులోని మాసుమాబీ దర్గా, ఆసార్ దర్గా, రెండో రోడ్డులోని బాహవుద్దీన మస్జిద్ తదితర ప్రాంతాల్లో పవిత్ర కేశదర్శనాన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - 2021-10-20T06:07:43+05:30 IST