ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
ABN, First Publish Date - 2021-04-15T06:43:00+05:30
జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్ 14: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అనంతపురంలో సాయంత్రం సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. నగరంలో వర్షపు నీరు రోడ్లపై పారింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఊరటచెందారు. హిందూపురం, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, శెట్టూరు, కుందుర్పి, శింగనమల, రాయదుర్గం, యాడికి, కళ్యాణదుర్గం, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. పుట్లూరు, గోరంట్ల, యల్లనూరు, కంబదూరు, తాడిపత్రి, గుత్తి, కూడేరు తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లిలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడటంతో దగ్ధమైంది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇదే సమయంలో విద్యుత్ అంతరాయం కలగడంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో ఓ మోస్తరు వర్షం పడిన ప్రాంతాల్లో జనం వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత తక్కువగానే ఉంది.
హిందూపురంలో గాలివాన
హిందూపురం: గాలివానకు పట్టణంలోని రోడ్లు జలమయం కాగా.. పలు చెట్లు నేలకొరిగాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గాలివానకు పట్టణంలోని రైల్వే రోడ్డు, వీడీ రోడ్డుతోపాటు పలు కాలనీల్లో వర్షపునీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహన దారులు ప్రత్యామ్నా య మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. మోడల్ కాలనీలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఆపేయటంతో పెనుప్రమాదం తప్పింది. హిందూపురం గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తం భాలు విరిగి పడ్డాయి. కల్లూరులో కొబ్బరి చెట్టుపై పిడుగుపాటుకు అగ్గి రాసుకుంది. తూమకుంట, గోళ్లాపురం, కొడిపి, మరవపల్లి, పూలకుంట గ్రామాల్లో రహదారుల్లో చెట్లు విరిగి పడ్డాయి. రెండు గంటలపాటు భారీ గాలులతో కూడిన వర్షంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించారు. లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాల్లో గాలులు వీచాయి. దీంతో మామిడి, చింతపండు, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న పట్టణ, గ్రామీణ వాసులకు వర్షంతో వాతావరణ చల్లబడి, ఉపశమనం దక్కింది.
రానున్న రెండు రోజుల్లో వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉపరితల అవర్తనం కారణంగా జిల్లాలో రానున్న రెండు రోజుల్లో గురు, శుక్రవారాల్లో వర్ష సూచన ఉందని వాతావరణ శాస్త్రవేత్త అశోక్కుమార్ తెలిపారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి.. ఉక్కపోత భారీగా పెరిగింది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం జిల్లాలో అత్యధికంగా పామిడిలో 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు మూడు రోజుల నుంచి స్వల్పంగా తగ్గాయి. యల్లనూరులో 39.1, గుమ్మఘట్టలో 38.6, శింగనమల, గుంతకల్లు, గార్లదిన్నెలో 38.3, కొత్తచెరువులో 38.1, శెట్టూరులో 37.9, తలుపులలో 37.2, యాడికిలో 37.1, పెద్దవడుగూరులో 37, అత్యల్పంగా ఓడీ చెరువులో 34.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - 2021-04-15T06:43:00+05:30 IST