అడ్డు లేవలేదని తొక్కుకుంటూ..మహిళలను నెట్టుకుంటూ వెళ్లిన అంబటి
ABN, First Publish Date - 2021-07-31T08:43:03+05:30
చెత్తపై పన్ను, ఆస్తిపన్ను పెంపుదలకు నిరసనగా శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పురపాలక సంఘ కార్యాలయం వద్ద సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది
అదేబాటలో అతని అనుచరులు
సత్తెనపల్లిలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం
ఎమ్మెల్యే అంబటిపై మహిళల ఫిర్యాదు
సత్తెనపల్లి, జూలై 30 : చెత్తపై పన్ను, ఆస్తిపన్ను పెంపుదలకు నిరసనగా శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పురపాలక సంఘ కార్యాలయం వద్ద సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కమిషనర్ శ్రీనివాసరావును మెట్ల మార్గం వద్దే సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మెట్లపై కూర్చున్న మహిళలను, సీపీఎం నాయకులను చేతులతో నెడుతూ, కాళ్లతో తొక్కుకుంటూనే పైకి వెళ్లారు. తన వెంట అందరినీ రమ్మని పిలవడంతో కొంతమంది వైసీపీ నాయకులు కూడా కార్యకర్తలను నెట్టుకుంటూ పైకి వెళ్లారు. కౌన్సిల్ సమావేశానికి తనను, ఎమ్మెల్యేను వెళ్లనీయకుండా అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని పోలీసులు వచ్చి సీపీఎం కార్యకర్తలను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేశారు.
మహిళలని చూడకుండా తొక్కుతూ వెళ్లారు!
ఆందోళన చేస్తున్న తమపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అతని అనుచరులు అసభ్యకరంగా వ్యవహరించారని సీపీఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళనని చూడకుండా తన భుజంపై చేయివేసి అవమాన పరిచారన్నారు. ఎమ్మెల్యేతోపాటు మున్సిపల్ చైర్మన్ భర్త చల్లంచర్ల సాంబశివరావు మరికొందరు.. ఆందోళన చేస్తున్న మహిళలను దూషిస్తూ కాళ్లతో తొక్కుకుంటూ కౌన్సిల్ హాల్కు వెళ్లారని ఆమె పేర్కొన్నారు.
Updated Date - 2021-07-31T08:43:03+05:30 IST